రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్

కరోనా సంక్షోభ సమయంలో ఆపద్బాంధువుడిలా మారిన ప్రముఖ నటుడు సోనూ సూద్ , దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. అయితే, సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఏడాది జరిగే బీఎంసీ ఎన్నికల్లో సోనూ సూద్ కాంగ్రెస్ తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడని కథనాలు వస్తున్నాయి. సోనూ సూద్, రితేశ్ దేశ్ ముఖ్, మిలింద్ సోమన్ (నటుడు, మోడల్)లలో ఒకరిని కాంగ్రెస్ బీఎంసీ మేయర్ అభ్యర్థిగా నిలపనుందని టాక్ వినిపిస్తోంది.

దీనిపై సోనూ సూద్ స్పందించారు. తాను మేయర్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావడంలేదని తెలిపారు. ఓ సాధారణ వ్యక్తిగా ఎంతో ఆనందంగా ఉన్నానని వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సోనూ సూద్ ప్రకటనతో ఊహాగానాలకు తెరపడినట్టయింది.