‘ఎస్పీబీ’ స్టూడియో

దివంగత గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం.. ఆయన పేరుపై ఎస్‌.పి.బి డబ్బింగ్ స్టూడియోను సీనియర్ నటుడు దక్షిణాది సినీ, టెలివిజన్ ఆర్టిస్టుల యూనియన్ అధ్యక్షుడు రాధారవి చెన్నైలో ప్రారంభించారు. ఈ స్టూడియోకు ‘ఎస్పీబీ’ అని పేరు పెట్టారు. డబ్బింగ్‌ యూనియన్‌ సభ్యులు, టెలివిజన్‌ ఆర్టిస్టుల సమక్షంలో శుక్రవారం స్టూడియో ఆరంభమైంది. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన వారం రోజుల తర్వాత ‘ఎస్పీబీ’ పేరుతో స్టూడియోను ఏర్పాటు చేస్తానని రాధారవి వెల్లడించారు. కేవలం రెండు నెలల వ్యవధిలో స్టూడియోను పూర్తి చేయడం పట్ల డబ్బింగ్‌ యూనియన్‌ ఆనందం వ్యక్తం చేసింది.

ఎస్పీబీ అనేక సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. కె. బాలచందర్‌ సినిమా ‘మన్మథలీల’ కోసం తొలిసారి వాయిస్‌ యాక్టర్‌గా పనిచేశారు. ఆపై కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, విష్ణువర్ధన్‌, సల్మాన్‌ ఖాన్‌, మోహన్‌, అనిల్‌ కపూర్‌, జెమిని గణేశన్‌, అర్జున్‌ తదితర కథానాయకులకు వివిధ భాషల్లో తన స్వరం అందించారు.