అనుష్టుప్ నారసింహ యాత్ర విజయవంతం అవ్వాలని శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

శ్రీకాళహస్తి: తెలుగు రాష్ట్రాల ప్రజా శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర శుభప్రదంగా మొదలయ్యి, ఎటువంటి ఆటంకాలు లేకుండా, విజయవంతంగా పూర్తి అవ్వాలని, మంగళవారం జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం, బహదూర్ పేట, ఉప్పు వీధిలోగల శ్రీ సంజీవరాయ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ ప్రచార రథ వారాహి వాహనానికి మంగళవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి ప్రచార రధాన్ని ప్రారంభించారు. ఇక్కడ నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. వారాహి అమ్మవారి కృపతో మా అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టబోయే వారాహి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని, 2024 లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా ఉండాలని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేయడం జరిగింది.