ఉగ్రవాదుల కాల్పుల్లో శ్రీకాకుళం సైనికుడి వీరమరణం

దేశ రక్షణలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్‌ జవాను వీర మరణం పొందాడు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు గ్రామానికి చెందిన బొంగు బాబూరావు అసోం రైఫిల్స్‌లో సైనికుని పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులో విధి నిర్వహణలో ఉండగా మిలిటెంట్లు జరిపిన ఎదురుకాల్పుల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు జవాను భౌతికకాయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంది. కాశీబుగ్గ దరి తాళభద్ర నుంచి అక్కుపల్లి మీదుగా స్థానిక యువకులు ద్విచక్ర వాహన ర్యాలీతో సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. గత నెల చివర్లో విధుల్లోకి వెళ్లి, 21 రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరిన మూడు రోజులకే అమరుడయ్యారు. శుక్రవారం ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు.