ప్రారంభమైన స్పుత్నిక్‌- వి వ్యాక్సినేషన్ డ్రైవ్‌

కొవిడ్‌పై పోరుకు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు భారత్‌లో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌- వి.. వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ లాంచ్‌ను అపోలో హాస్పిటల్స్ ఈ ఉదయం ఆవిష్కరించింది. డా. రెడ్డీస్ సిబ్బంది అశోక్‌కు స్పుత్నిక్ మొదటి డోసు వేసి వాక్సినేషన్ డ్రైవ్‌ను మొదలుపెట్టింది. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో వాక్సినేషన్ పైలెట్ ప్రాజెక్ట్ ను అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డా. కె. హరిప్రసాద్, డా. రెడ్డీస్ సీఈవో ఎం.వి. రమణ ప్రారంభించారు. హైదరాబాద్, విశాఖపట్నంలలో ఏకకాలంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది.

స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు ఎక్కువగా డిమాండ్ ఉందని డాక్టర్ రెడ్డీస్ సీఈవో తెలిపారు. మొదటి డోస్‌కు ఇవాళ ట్రయల్ రన్ ప్రారంభమైందన్నారు. ఇందులో భాగంగా 50 వేల మందికి టీకాలు ఇవ్వనున్నట్లు వివరించారు. 63 దేశాల్లో స్పుత్నిక్ టీకాకు ఆమోదం లభించిందని ఆయన చెప్పారు. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారీ, పంపిణీకి డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.