నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రెల్లి యువత

  • దళితులను ఉన్నత స్థాయిలో చూడాలన్నదే పవన్ కళ్యాణ్ తపన
  • అణగారిన వర్గాలకు, నిమ్న కులాలకు అండగా జనసేన
  • పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై పోరాటానికి జనసేన ఎప్పుడూ సిద్ధమే
  • ప్రజలకు క్షేత్రస్థాయిలో జనసైనికులు అండగా నిలవాలి
  • జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా దళితులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, దళితులను అత్యున్నత స్థాయిలో చూడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తపన పడుతుంటారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి నేతృత్వంలో రాష్ట్ర రెల్లి యువ నేతలు సోమి ఉదయ్ తదితరులు బుధవారం ఆయనను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల్లోనూ ప్రధానంగా అట్టడుగు వర్గాల ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని, అవగాహనా రాహిత్యాన్ని ఆసరా చేసుకుని కొంతమంది రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఇక గతంలో ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం దళితులను దగా చేసిందని ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం కోసం, దళిత బిడ్డల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సుమారు 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితుల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో దళితులను ఏ విధంగా అణచివేస్తున్నాడో, వారిపై ఎంతటి భౌతిక దాడులకు పాల్పడుతున్నాడో వైసీపీ నేత ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అణగారినవర్గాలకు, నిమ్న కులాలకు జనసేన అండగా నిలుస్తుందని ఎవరూ కూడా అధైర్య పడవద్దన్నారు. ఇక అసెంబ్లీ సాక్షిగా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి అలవాటుగా మరచిపోయాడని ఎద్దేవా చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై పోరాడేందుకు జనసేన పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్ తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుంచి రెల్లి జాతికి గౌరవం, విలువ మరింత పెరిగాయని రెల్లి యువ నేత సోమి ఉదయ్ అన్నారు. ప్రతీ రెల్లి గుండెలో పవన్ కళ్యాణ్ శాశ్వత స్థానాన్ని సంపాదించారన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని సోమి ఉదయ్ అన్నారు. మనోహర్ ని కలిసిన వారిలో నరసింహ, గుర్రాల ఉమ తదితరులున్నారు.