అన్నవరం-బాపట్ల మధ్య కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

*లోక్ సభలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ – సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ

కాకినాడ: కాకినాడ జిల్లా అన్నవరం నుండి బాపట్ల వరకు కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లోక్ సభలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు. సోమవారం లోక్ సభలో రైల్వే శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ పై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం 947 కి.మీ పొడవుగా విస్తరించి ఉన్నప్పటికీ, సమర్థవంతమైన రైల్వే కారిడార్ లేకపోవడం వల్ల వాణిజ్యం, లాజిస్టిక్స్, అలాగే ప్రాంతీయ పోర్టుల అనుసంధానంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడ రేవులను అనుసంధానం చేస్తూ కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల సరుకు రవాణా సులభతరమయ్యేపాటు వ్యవసాయరంగం, సీ ఫుడ్ ఎగుమతులకు కూడా తోడ్పడుతుందని తెలిపారు. కేవలం 30 కి.మీ కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణంతో తక్కువ పెట్టుబడిలోనే కోస్టల్ కారిడార్ పూర్తయ్యే అవకాశం ఉందని, దీని ద్వారా కాకినాడ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే మెయిల్ లైన్ డిమాండ్ కూడా నెరవేరుతుందని చెప్పారు. ఇదే సమయంలో, కోస్టల్ కారిడార్ వల్ల బొగ్గు రవాణాపై ఆధారపడడం తగ్గి, రైల్వే సరుకు రవాణా మరింత సమర్థవంతంగా మారుతుందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి & వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృషితో కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేయడం, అలాగే రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రూ.9,417 కోట్ల భారీ కేటాయింపులు జరగడం పట్ల ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Share this content:

Post Comment