సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేత.. స్టే విధించిన హైకోర్టు !

పక్క రాష్ట్రాల నుండి వచ్చే అంబులెన్సుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా బాధితుల అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుండడంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలంగాణ హైకోర్టు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీ నుంచి కరోనా రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు వెళుతుండగా అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సాయంతో అంబులెన్సులను నిలిపివేస్తోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదంటూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అంబులెన్సులను ఆపొద్దని స్పష్టం చేసింది. అలాగే వచ్చే విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. కాగా నేటి విచారణలో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తమ వాదనలు వినిపించింది.

ఏపీ సర్కారు తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇతర రాష్ట్రాల వాహనాలను అడ్డుకుంటే అది ఆర్టికల్ 14 ఉల్లంఘనే అని ఏజీ వాదించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము వ్యవహరిస్తున్నామని ఇతర రాష్ట్రాల వారు వస్తే రాష్ట్రంలో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని కోర్టుకి తెలిపింది. అయితే తెలంగాణ హైకోర్టు ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై సానుకూలంగా స్పందించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల సహాయం కోసం కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను నిలుపుదల చేసిన హైకోర్టు అంబులెన్సులను ఆపేందుకు వీల్లేదని తెలంగాణ పోలీసు శాఖకు స్పష్టం చేసింది.