1000కి పైగా చిన్నారులకు హార్ట్ స‌ర్జ‌రీలు చేయిoచిన సూపర్ స్టార్‌

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మ‌హేష్‌ బాబు సామాజిక స్పృహ‌ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే ఆయన తెలుగు రాష్ట్రాల్లో రెండు పల్లెటూళ్లను దత్తత తీసుకుని సొంత ఖర్చుతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. అలాగే నిరు పేద‌ల‌కి ఆయన అండ‌గా ఉంటున్నాడు. చిన్నారుల‌కి హార్ట్ ఆప‌రేష‌న్స్ చేయిస్తూ వారి కుటుంబాల‌లో ఆనందం నింపుతున్నారు మ‌హేష్‌. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్‌లు నిర్వహించడమే కాకుండా అవ‌స‌ర‌మైన వారికి స‌ర్జ‌రీలు కూడా చేయిస్తూ..ఇప్పటికి గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న 1000కి పైగా చిన్నారులకు హార్ట్ స‌ర్జ‌రీలు చేయించి రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నాడు మ‌హేష్‌. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు ఆయన ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ తర్వాత చిన్నారులిద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో.. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇన్‌స్టాగ్రమ్‌లో నమ్రత స్పందన

‘‘నా హృదయాన్ని కదిలించేలా ఆంధ్ర ఆసుపత్రులతో సంబంధం కలిగి ఉండటం నాకు ఎంతో గర్వకారణం. చిన్న పిల్లల డాక్టర్ పి.వి.రామారావు మరియు అతని నిపుణుల బృందం  ఇద్దరు చిన్నారులకు ఊపిరి పోశారు. భవ్యశ్రీ మరియు సింధు కోలుకున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి సంతోషంగా ఉంది. బాలికలు మరియు వారి కుటుంబాలకు దీవెనలు.  సురక్షితంగా ఉండండి..’’ అని నమ్రత తన ఇన్‌స్టాగ్రమ్‌లో పేర్కొన్నారు.