పార్టీ మారడం కేవలం ఊహాగానాలే: జానారెడ్డి

కాంగ్రెస్ నేత జానారెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లను ఆయన ఖండించారు. తాను పార్టీ మారడం కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. తనను ఎవరూ సంప్రదించలేదని, తానెవరినీ సంప్రదించలేదని తెలిపారు. పీసీసీ ముందు వరుసలో తానే ఉండాలని, అధిష్టానం పీసీసీ ఎవరికిచ్చినా సహకరిస్తానని ప్రకటించారు. నాగార్జున సాగర్‌లో ఎవరికి టికెట్ ఇచ్చిన కలిసి పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని జానారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన బీజేపీ…. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ పునాదులను పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వివిధ పార్టీల్లోని సీనియర్లు, ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు మళ్లించుకొని, అధికార పీఠానికి చేరువయ్యేలా ఢిల్లీ వ్యూహకర్తలు ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగానే జానారెడ్డిని బీజేపీ కదిపిందని నేతలు పేర్కొంటున్నారు. నాగార్జునసాగర్ పై రాజకీయంగా జానారెడ్డికి ఎనలేని పట్టుంది. తద్వారా నాగార్జున సాగర్‌లో పాగా వేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి.