ఓటరు జాబితా అవకతవకలపై చర్యలు తీసుకోండి: జంగాల శివరామ్ రాయల్

మదనపల్లె నియోజకవర్గంలో ఓటరు జాబితా అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఓటరు జాబితా వెరిఫికేషన్, ఈవీఎం యంత్రాల పనితీరుపై రాజకీయ పార్టీల నాయకులకు, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ ఓటరు జాబితా తప్పులతడకగా ఉందన్నారు. దీంతోపాటు అవకతవకలు ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా అర్హుల ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్చడం, ఒక వార్డులోని ఓట్లు మరో వార్డులోకి చేర్చడం, డోర్ నంబర్లు సరిగా లేకపోవడం, డబుల్ ఎంట్రీ, ఓటర్ నమోదులో టెక్నికల్ సమస్యలు, సిబ్బంది నిర్లక్ష్యం, ఇలా అనేక సమస్యలతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని వాపోయారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా తయారు చేయాలన్నారు. కానీ అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ అర్హుల ఓట్లను తొలగిస్తూ దొంగ ఓట్లు చేరుస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించి జాబితాను సరిదిద్దాలని సూచించారు. టీడీపీ రాజంపేట పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ అర్హుల ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్చడంలో అధికార యంత్రాంగమే కీలకపాత్ర పోషిస్తోందని ఆరోపించారు. దీంతో ఓటరు జాబితా తప్పులతడకగా ఉందని విమర్శించారు. జాబితాను చక్కదిద్దే బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే 18 ఏళ్లు పూర్తయిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు విద్యాసాగర్, శంకర, హరి, కార్యకర్తలు పాల్గొన్నారు.