కూకట్పల్లి, మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లాల నాయకులు, నియోజకవర్గం నేతలు పార్టీ కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ కోరారు. దీనిలో భాగంగా మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి లోని వైష్ణవి గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. 14వ తేదీన జనసేన నేతలు భారీ ఎత్తున తరలివచ్చి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పార్టీ ఆవిర్భావ సభ ఇది అని చిత్రాడ సభ వేదికగా పార్టీకి సంబంధించిన పలు అంశాలను అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ సూచనలు చేయనున్నారని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు సైతం సిద్ధంగా ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు, వీరమహిళలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment