దర్శకధీరుడు రాజమౌళికి తెలంగాణ ఎంపీ వార్నింగ్
దర్శకధీరుడు రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ పాత్రకు పెట్టిన టోపీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వీరుడు కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్ వివాదం రేపుతోంది. కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఈ నెల 22న ఎన్టీఆర్ లుక్ని రివీల్ చేస్తూ టీజర్ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజరే ఇప్పుడు వివాదస్పదమయ్యింది. టీజర్లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ ఈ వివాదానికి దారితీసింది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని మండిపడుతున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళికి ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలి, ఒకవేళ అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉందని అయన అన్నారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని ఆయన అన్నారు. నైజాం కు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీం ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని అన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్ర ను తెలుసుకోవాలి, లేకుంటే మర్యాద ఉండదని ఆయన అన్నారు.
అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రెస్మీట్ పెట్టిన సమయంలో రాజమౌళి ఓ క్లారిటీని ఇచ్చారు. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్గా కనిపించనున్నారని తెలిపారు. కానీ ఇది వారి జీవిత చరిత్ర కాదని.. రియల్ లైఫ్ కారెక్టర్లతో ఫిక్షన్ కథాంశంతో ఆర్ఆర్ఆర్ ఉంటుందని స్పష్టం చేశారు.
అలాగే ఇది దేశభక్తి చిత్రం కూడా కాదని టీమ్ ఆ మధ్యన ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చింది. కానీ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పేర్లతో టీజర్లు రావడంతో.. ఈ ప్రాజెక్ట్ వారి జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.