హుజురాబాద్ నేతల్లో టెన్షన్ టెన్షన్.. ఆ ఓటర్లు ఎటువైపు ?

ఐదు నెలలుగా ప్రచార పర్వంలో మునిగి తేలుతున్న నేతలు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించారు. హుజురాబాద్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకున్న బీజెేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు ఇప్పటికే నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో గల్లీ గల్లీలో కలియ తిరిగారు. ఆలస్యంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేతలతో ప్రచారం చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉందని ఆ పార్టీల నేతలు అభిప్రాయ పడుతున్నప్పటికీ ధీటైన పోటీ ఇచ్చే ఓటు బ్యాంకును పదిల పరుచు కోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది.

పెరిగిన ఓట్లతో నేతల్లో టెన్షన్ :

ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నప్పటికీ నియోజకవర్గంలో నమోదైన కొత్త ఓట్లు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులను టెన్షన్‌లో పడేస్తున్నాయి. కొత్త ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారోననే ఉత్కంఠ నెలకొంది. నూతనంగా ఎన్ రోల్ అయిన ఓటర్ల సంఖ్య 10 వేలకు పైనే ఉంటుందని ఓ అంచనా. ఈ నేపథ్యంలో వీరు గెలుపోటములను శాసించే అవకాశం లేకపోలేదన్నది వాస్తవం. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం చేస్తున్న క్రమంలో పోలింగ్ నాటికి ఈ పరిస్థితి మరింత టఫ్ వార్‌గా మారే అవకాశం లేకపోలేదు. దీంతో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల ఎటు వైపు మొగ్గుతారన్నదే కీలకంగా మారింది.

అనుమానాలెన్నో…

నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి నియోజకవర్గంలో 2.36 లక్షల ఓటర్లు ఉండగా అదనంగా 10 వేలకు పైగా ఓటర్లు నమోదు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నట్టుండి కొత్త ఓటర్లు అంత పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవడంపై చర్చ సాగుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లను కూడా కావాలనే నమోదు చేయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని ఏదో ఓ ఇంటిలో నివాసముంటున్నట్లు నమోదు చేసుకున్న ఓట్లు కీలకం కానున్నాయనే చర్చ సాగుతున్నది. అయితే కొత్త ఓటర్ లిస్టులో నాన్ లోకల్ వాళ్లెవరు ఓటు నమోదు చేసుకున్నారో చూసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి సమయాత్తం అవుతున్నారు ఆయా పార్టీల నాయకులు.

పోస్టల్ బ్యాలెట్లు కీలకమే :

అంది వచ్చిన ప్రతి విషయాన్ని కూడ వదులుకోవద్దన్న యోచనతో రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. దీంతో చాలా మంది పోస్టల్ బ్యాలెట్లపై దృష్టి పెట్టాలని క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నారు. కోవిడ్‌తో బాధ పడుతున్న వారితోపాటు 80 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
ఆ ఓట్లు తమ పార్టీ అభ్యర్థికి పోల్ అయ్యేలా ఆయా పార్టీల కార్యకర్తలచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. , ఇప్పటివరకు 822 మంది వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి ఓట్లు గంపగుత్తగా తమ పార్టీకే వేయించుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పోల్ మేనేజ్ మెంటే కీలకం

ఉధృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న బీజేపీ,టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ పైనే దృష్టి పెట్టాయి. నియోజకవర్గానికి చెందిన ఓటర్లు వివరాలు సేకరించేందుకు కూడా ప్రత్యేక దృష్టి సారించాయి. హుజురాబాద్‌కు చెందిన వారు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వారి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారందరిని సొంత ఖర్చులతో తరలించడానికి ఇప్పటినుండే ఏర్పాట్లు చేస్తున్నారు.