అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..!

ఆళ్లగడ్డ నియోజకవర్గం, రుద్రవరం మండలంలో ఆలమూరు, చిత్రేనిపల్లె, ముకుందాపురం, హరినగరం, నరసాపురం, ముత్తలూరు గ్రామాలలో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కురిసిన వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, బొప్పాయి, అరటి పంటలతో నష్టపోయిన రైతులను ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు దేశానికి వెన్నెముక.. అన్నం పెట్టే రైతన్న కష్టాల్లో ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానిదే అని తెలియజేశారు. నష్టపోయిన రైతులలో కౌలు రైతులు ఎకరాకు 30 వేలు కౌలు చెల్లించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో నష్టపోయామని ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని తెలియజేశారు. రుద్రవరం మండలంలో 2000 ఎకరాలు వరి, 500 ఎకరాలు బొప్పాయి, 300 ఎకరాలు మొక్కజొన్న, 200 ఎకరాలు అరటి పంట నష్టం జరిగిందని తెలియజేశారు. వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల పొలాల దగ్గరికి వెళ్లి సమగ్ర సర్వే చేసి నష్టపోయిన ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతగా తీసుకొని నష్టపోయిన రైతు కుటుంబాలకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న 3000 కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకున్నా కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం చేస్తున్న గొప్ప మనసున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తికి రైతులు అండగా ఉండాలని, త్వరలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, ఆంజనేయులు, రామిశెట్టి కుమార్, వేణు, చిన్న పెద్దయ్య, వీరయ్య పాల్గొన్నారు.