జగన్ ఆదేశం మేరకు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి

విశాఖపట్నం గాజువాకలో ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి హత్య చేయడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను ఏమాత్రం ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘాతుకాలు జరగకుండా చూడాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ నీలం సాహ్నీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

మహిళల భద్రత విషయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధంగా చైతన్యం తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే సీఎం జగన్… వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలంటూ హోంమంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులను ఆదేశించారు.సిఎం ఆదేశాలతో హోంమంత్రి మేకతోటి సుచరిత గాజువాకలోని బాధిత కుటుంబం నివాసానికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం రూ.10 లక్షల చెక్ ను వారికి అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమోన్మాది అఖిల్ వెంకటసాయి ఓ పథకం ప్రకారమే వరలక్ష్మిని అంతమొందించాడని, 7 రోజుల్లోనే విచారణ పూర్తిచేస్తామని, సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామని వెల్లడించారు. వరలక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. కాగా, వరలక్ష్మి హత్య జరిగిన ప్రాంతంలో క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయని, అయితే అవి పోలీసులను విచారణ నుంచి తప్పుదోవ పట్టించేందుకే చేసి ఉంటారని హోంమంత్రి పేర్కొన్నారు. వీటిపైనా విచారణ జరుపుతామని చెప్పారు.