తెలంగాణలో చిట్టచివరి టీడీపీ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో చేరిక

తెలంగాణ శాసనసభలో టీడీపీ ప్రాతినిధ్యం నేటితో ముగిసింది. టీడీపీ చిట్టచివరి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాంతో టీడీపీకి తెలంగాణ అసెంబ్లీలో ఒక్క సభ్యుడు కూడా లేకుండా పోయారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చాన్నాళ్ల కిందటే టీఆర్ఎస్ పక్షం వహించారు. మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తాజాగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో, టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ అందించారు.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో అత్యంత కష్టంగా మనుగడ సాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇది తీవ్ర నిరాశ కలిగించే పరిణామం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు.