టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్
ఐపీఎల్-13లో భాగంగా షార్జా వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ల్లో ధనాధన్ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన రెండు జట్లు ఇవాళ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ను మట్టికరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కోల్కతా నైట్రైడర్స్ ఢీకొనబోతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ ఫామ్ను అందుకోవడం, బౌలర్లు కూడా నిలకడగా రాణిస్తుండటం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. ఇప్పటివరకు లీగ్లో ఆడిన 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 4 గెలిచి 2 ఓడిపోయింది. ప్రస్తుతం 8 పాయింట్లతో జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ కూడా 4 మ్యాచ్ల్లో గెలిచి మూడో స్థానంలో ఉంది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. మరీ ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి.