ఏపీలో వచ్చే నెల 16 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిన్న జగనన్న విద్యాదీవెన రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బడులు తెరుచుకున్న రోజునే జగనన్న విద్యాకానుకను పంపిణీ చేస్తామన్నారు. విద్యాకానుకలో ఈసారి డిక్షనరీని కూడా చేర్చినట్టు చెప్పారు. అలాగే, నాడు-నేడులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేసిన 15 వేల బడులను ప్రజలకు అంకితం చేయనున్నట్టు తెలిపారు. అదే రోజున రెండో విడత నాడు-నేడుకు శ్రీకారం చుడతామని మంత్రి వివరించారు.