ఏపీ కొత్త ఎమ్మెల్సీలుగా ఆ నలుగురు.. ఆమోదం తెలిపిన గవర్నర్

ఏపీలో గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల కోటాలో లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజులు పదవులు చేపట్టడం ఇక లాంఛనమే. ఏపీలో 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్ కు తరలి వెళ్లి, గవర్నర్ తో ఎమ్మెల్సీల అంశం చర్చించారు.

ప్రభుత్వం అంతకుముందే నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ కు సిఫారసు చేయగా, ఫైలును ఆయన పెండింగ్ లో ఉంచినట్టు తెలిసింది. సీఎం జగన్ తో భేటీకి కొద్ది ముందుగా గవర్నర్ ఆ ఫైలుకు ఆమోదం తెలుపగా, గవర్నర్ తో భేటీ అయిన సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.