- ఏ.కే.యూ. ఆధ్వర్యంలో 6కే రన్ జెండా ఊపి ప్రారంభించిన వి.సి.
మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్. మూర్తి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం, ఒంగోలు లోని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ప్రాంగణంలో స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, వారంరోజుల పాటు జరుగుతున్న ఫిట్ ఇండియా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ.దేవీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ, అన్ని రంగాలలో మహిళలు పురోగతిని సాధిస్తున్నారని, ప్రత్యేకించి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళలు ముందుండాలని ఆకాంక్షించారు. డాక్టర్ దేవీ వర ప్రసాద్ మాట్లాడుతూ, మదర్ థెరిస్సా, సరోజినీ నాయుడు, సునీత విలియమ్స్ లాంటి మహిళా మూర్తులను స్ఫూర్తిగా తీసుకుని, ప్రత్యేకంగా కళాశాల యువతులు మరియు పాఠశాలల బాలికలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని అన్నారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ తరుపున 6కే రన్ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ మూర్తి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నుంచి ప్రారంభమై, మినీ స్టేడియం, భాగ్యనగర్ నాలుగో లైన్, రిమ్స్ వైద్యశాల, నెల్లూరు బస్టాండు, రామ్ నగర్ నాలుగో లైన్, ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం, బిలాల్ రెస్టారెంట్, నవోదయ స్కూల్ మార్గం గుండా తిరిగి ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ప్రాంగణానికి చేరుకుంది. ఈ సందర్భంగా, యువతులు మరియు మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మహిళాభ్యుదయం మరియు మహిళా దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.కే.యూ ఎం.ఎడ్ విభాగం సహాయ ఆచార్యురాలు డాక్టర్ అమృతవల్లి, శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వసంత లక్ష్మీ, మహిళా అధ్యాపకులు ఏ.సిరితేజ, పి.నాగలక్ష్మి, ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం సహాయ ఆచార్యుడు ఆడపాల వెంకటేశ్వర్లు, బి.పి.ఎడ్, ఎం.పి.ఎడ్ విద్యార్థినులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment