వివాదంలో త్రిష… ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!

తొలి నుంచి కూడా సినీ నటి త్రిష సంచలనాలకు కేంద్ర బిందువుగానే ఉంటోంది. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నా త్రిష ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గానే కొనసాగుతోంది. దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష… తన కెరీర్ లో అగ్రనటులు అందరి సరసన నటించింది. అయితే, గత కొంత కాలంగా ఆమె స్లో అయింది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, జయరామ్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

సినిమా షూటింగ్ సందర్భంగా త్రిష చేసిన పనికి అక్కడి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి కారణంలో ఒక దేవాలయంలో ఆమె చెప్పులు వేసుకుని తిరగడమే. షూటింగ్ లో భాగంగా శివుడు, నంది విగ్రహాల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ సందర్భంగా ఆమె చెప్పులు ధరించి ఉండటం వివాదానికి కారణమైంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయంలో చెప్పులు ఎలా వేసుకుంటారంటూ హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు హిందువుల మనోభావాలను గాయపరిచినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ విద్యామండల్ సంస్థ అధ్యక్షుడు దినేశ్ కట్టోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.