TRS : అధ్యక్ష పదవికి ‘కేసీఆర్’ నామినేషన్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ తరఫున మంత్రులు నామినేషన్‌ సమర్పించారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ తరఫున పార్టీ అధ్యక్ష పదవికి మంత్రులు నిరంజన్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్ గౌడ్ నామినేషన్‌ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను మంత్రి మహమూద్‌ అలీ ప్రతిపాదించగా, మంత్రులు బలపరిచారు.

కాగా ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 25 హైటెక్స్‌లో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. నేటి నుంచి 22 తేదీవరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లు స్వీకరించునున్నారు.

ఇక ఇదిలా ఉంటే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ(17 అక్టోబర్ 2021) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో ముఖ్యమైన సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఉమ్మడి సమావేశంలో పాల్గొననున్నారు కేసీఆర్. పార్టీ సంస్థాగత నిర్మాణం, హెచ్‌ఐసీసీలో అక్టోబర్ 25వ తేదీన నిర్వహించనున్న ప్లీనరీ, అలాగే, వచ్చే నెల 15న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.