టీఆర్ఎస్ నేత పుట్ట మధు అరెస్ట్!

కొద్ది రోజు క్రితం అదృశ్యమైన పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఆయనను పోలీసులు భీమవరంలో అరెస్ట్ చేశారు. మధును ఏ కేసులో అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పలేదు. గత వారం రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్టా మధును పోలీసులు.. ఏపీ నుంచి హైదరాబాద్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

కాగా.. గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. శుక్రవారం కూడా మధు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న అంశం మిస్టరీగా మారింది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్‌కు పుట్ట మధు సన్నిహితంగా ఉన్నారు. సీఎం కేసీఆర్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నందునే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు హైకోర్టు న్యాయవాదులు వామన్‌ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. పుట్ట మధు మిస్సింగ్ వ్యవహారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. ఇప్పుడు భీమరంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు తన భర్తపై బయట జరుగుతున్న ప్రచారం చాలా తప్పని పుట్ట మధు భార్య పుట్ట శైలజ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ పార్టీలో ఉండేవారు కాబట్టి, ఆయన్ను అప్పట్లో కలిశామని తెలిపారు. తాము టీఆర్‌ఎస్‌ తోనే ఉంటామని, తమను ఈ స్థాయికి తీసుకొచ్చింది సీఎం కేసీఆరేనని చెప్పారు. పుట్ట మధుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని శైలజ ఆరోపించారు.