బీజేపీలో చేరనున్న టీఆర్ఎస్ సీనియర్ నేత

గ్రేటర్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అసంతృప్త నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు, మాజీలు కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాషాయం కండువా కప్పేసుకున్నారు. తాజాగా.. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ కురుమ సంఘం ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ (శ్రీకాంత్‌) నేడు తన సతీమణి సుచిత్రతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పీజీ రోడ్డులోని ఆర్యవైశ్య అభ్యుద య సంఘం హాల్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, బీజేపీ సికింద్రాబాద్‌ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.

సత్యనారాయణ కురుమ సంఘం ఉపాధ్యక్షుడి పదవితోపాటు సికింద్రాబాద్‌ క్లాత్‌మార్చెంట్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ తరఫున రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఎన్నికల అనంతరం కొన్ని రోజులు పార్టీలో కొనసాగినా తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నుంచి తన సతీమణి చీర సుచిత్రకు టికెట్‌ ఆశిస్తూ ఆ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆయన బీజేపీలో చేరనున్నారు.