చిరంజీవి చారిటీ ఆధ్వర్యంలో 4 వేల మందికి సినీ కార్మికులకు టీకా

మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ ఆధ్వర్యంలో గత వారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగు వేల మంది సినీ కార్మికులకు వ్యాక్సినేషన్ వేయించినట్లు చిరంజీవి వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

చిరంజీవి గత ఏడాది ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ ( CCC) , కరోనా వైరస్ మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు కొద్ది నెలల పాటు ఉచితంగా రేషన్ సరఫరా చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండవ వేవ్ సమయంలో చిరంజీవి స్వయంగా ఆక్సిజన్ బ్యాంకులను తెలుగు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో స్థాపించారు. అయితే CCC ఆధ్వర్యంలో సినీ పరిశ్రమకు సంబంధించిన నాలుగు వేల మంది కార్మికులకు గత వారం రోజులలో టీకాలను వేయించినట్లు చిరంజీవి వెల్లడి చేశారు. సినీ కార్మికులు కాకుండా సినీ ఫెడరేషన్ కు సంబంధించిన, ఇతర అసోసియేషన్ లకు చెందిన వ్యక్తులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందని చిరంజీవి ప్రకటించారు. అపోలో తో సహా ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల తో చిరంజీవి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం టై అప్ చేసుకుని ఉన్నారు.

ఏది ఏమైనా చిరంజీవి తదితరులు ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ చారిటీ తెలుగు సినీ కార్మికులకు అండగా నిలవడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.