శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలతో వరలక్ష్మీవ్రతం విశిష్టత మీకోసం…

సకల శుభాలు కలిగించే వరలక్ష్మీవ్రతం

హిందువులు అత్యంత పవిత్రంగా ఆచరించే వ్రతం వరలక్ష్మీ వ్రతం. భక్తితో వేడుకుంటే  కోరిన వరాలు ఒసగే తల్లి వరలక్ష్మీ దేవిని… శ్రావణమాసంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణమాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మరియు సకల శుభాలుకలుగుతాయి. కొత్త కోడళ్లతో అత్తవారింటి వారు ఈ వ్రతాన్ని చేయించడం ముఖ్య విశేషం. లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదోతనం మరియు సంతానాభివృద్ది కలకాలం సమృద్దిగా ఉంటాయని శాస్త్రం చెప్తోంది.

వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. సంపదలనిచ్చే తల్లి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల సంపదలూ కలుగుతాయి. ఈ వ్రతాన్నిఆచరించడానికి నియమాలు, నిష్ఠలు, మడులు కంటే భక్తి ప్రధానం. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి అష్టోత్తరం, లలితా సహస్రనామాలు చదవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. శ్రావణ శుక్రవారం ఆలయ దర్శనం చేసుకుంటే అమ్మవారి అభయం లబిస్తుంది.

వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయాన్నే లేచి స్నాన కృత్యముల అనంతరం గుమ్మాలకు మామిడితోరాణాలు కట్టి ముంగిళ్లలో ముగ్గులు వేసి, గడపలకు పసుపు అద్ది కుంకుమ బొట్లు పెట్టి వరలక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిoచిన అనంతరం అమ్మవారిని శక్తీ కొలదీ అందంగా అలంకరించి పూజా సామాగ్రి, నైవేద్యాలు, పూలు, పళ్ళు, అక్షతలు, అన్నీ సిద్ధం చేసి, వరలక్ష్మివ్రతకల్పవిధానం ప్రకారం ముందుగా పసుపుతోచేసిన గణపతిని పూజించి అనంతరం అమ్మవారిని షోడశోపచారాలతో పూలు, పుష్పాలు, అక్షంతలు, గంధం తో అర్చించి, అమ్మవారికి ఇష్టమైన  నైవేద్యాలు సమర్పించి, వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో యధావిధిగా ఆచరించి అమ్మవారి కృపాకటాక్షాలను  పొందండి. వరలక్ష్మీవ్రతoలో చదివే ముఖ్యమైన కథను ఒకసారి చదువుకుందాం.

వరలక్ష్మీవ్రత కథ :

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి.. స్త్రీలుసర్వసౌఖ్యాలను పొంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగే వ్రతం ఒకదానిని చెప్పమని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వరలక్ష్మీ వ్రతం ఒకటున్నది అని చెప్పాడు. దానిని శ్రావణమాసంలో రెండో శుక్రవారం ఆచరించాలని ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చును అని తెలుపగా అప్పుడు పార్వతీదేవి… ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఎలా చేయాలో వివరంగా చెప్పమని అర్ధించింది. కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు ప్రకారములతో  రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతః కాలమున నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కుని గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మీదేవి సాక్షాత్కారం :- ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కల అని గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేయమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జెలు లు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు.