శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి

తిరుమల: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయన డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్ప నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశ ప్రజలంతా పరిపూర్ణ ఆరోగ్యం, సుఖ శాంతులతో వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.