ఏపీలో విద్యా కానుక ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసింది. పేద విద్యార్ధులకు ఉపయోగపడేలా తీసుకొచ్చిన జగనన్న విద్యా కానుక నేడు సీఎం జగన్ చేతుల మీదుగా విజయవాడలోని పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఓ కిట్ బ్యాగును స్వయంగా భుజానికి తగిలించుకున్న ఆయన చిరునవ్వులు చిందించారు. జగన్ ఎంతో ఉల్లాసంగా ఉండడాన్ని గమనించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కూడా నవ్వేయడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

కాగా, ఈ విద్యాకానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.650 కోట్లు ఖర్చు చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులకు పైగా జగనన్న విద్యాకానుక పేరిట కిట్ బ్యాగులు అందిస్తారు. ఇదిలా ఉంటే పునాదిపాడు హైస్కూల్‌లో నాడు-నేడు పనులను జగన్ పరిశీలించారు. అనంతరం స్కూల్ బెంచ్ మీద కూర్చుని జగన్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

ఈ విద్యాకానుకలో భాగంగా ఓ స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ ఉంటాయి. యూనిఫాం కుట్టుకూలి కూడా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. జగనన్న విద్యాకానుక కోసం సర్కారు రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది.