నవీన్ పోలిశెట్టి మూవీలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్!

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండకు మధ్య చక్కని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా మంచి స్నేహితులైన వీరు ఒకరికి ఒకరు ఎప్పుడూ దన్నుగా నిలబడతారనే విషయం తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’ చిత్రంలో మెరుపులా మెరిశాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించబోతున్నారు.

25 సంవత్సరాల అబ్బాయికి, 40 యేళ్ళ అమ్మాయికి మధ్య సాగే ఈ ప్రేమకథా చిత్రాన్ని మహేశ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. యు. వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడట. విశ్రాంతికి ముందు విజయ్ దేవరకొండ పాత్ర వస్తుందని, సినిమాలో ఇది ఎంతో కీలకమైనదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తలో నిజం ఉంటే మాత్రం. ఈ మూవీపై అంచనాలు అంబరాన్ని తాకడం ఖాయం.