రామోజీ ఫిలిం సిటీలో విశాల్ షూటింగ్!

తమిళనాట మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా విశాల్ సినిమాలను ఇష్టపడే అభిమానులు ఎక్కువే. ఈ మధ్య కాలంలో విశాల్ వరుస సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాలు రెండు సెట్స్ పై ఉన్నాయి. అవి విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే విశాల్ మరో ప్రాజెక్టును ఎనౌన్స్ చేశాడు. ఇది కెరియర్ పరంగా ఆయనకు 31వ సినిమా.

విశాల్ ఈ సినిమాను వెంటనే సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనుకున్నాడు. అయితే కరోనా కారణంగా కుదరలేదు. దాంతో కరోనా ప్రభావం తగ్గేంతవరకూ వెయిట్ చేసిన ఆయన, తాజాగా హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగును మొదలుపెట్టారు. జులై చివరివరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుందట. సొంత బ్యానర్ పై విశాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, ‘నాట్ ఏ కామన్ మేన్’ అనే టైటిల్ ను సెట్ చేశారు. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ గా ఉండనుంది. ఈ సినిమా ద్వారా ‘శరవణన్’ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.