వాలంటీర్లు.. వైసీపీతో జాగ్రత్త..!

  • జనసేన చంద్రగిరి నేత దేవర మనోహర

చంద్రగిరి నియోజకవర్గం: వైసిపి నాయకులు వాలంటీర్లను బానిసలుగా వాడుకుంటున్నారని జనసేన పార్టీ నేత దేవర మనోహర ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లను అన్ని పనులకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రావారిపాలెం మండలం ఉదయ మాణిక్యం గ్రామంలో ఒక మహిళా వాలంటీర్ నాటు సారా తయారు చేస్తుందన్న సమాచారంతో మూడు రోజుల క్రితం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించి ఎలాంటి నాటు సారా లేదని ప్రకటించారన్నారు. కానీ రెండు రోజుల తర్వాత అదే మహిళా వాలంటీర్ రోడ్డుపై క్యాన్ తో నాటు సారా తరలిస్తుందని అరెస్టు చేసినట్టు ఆమెను రిమాండ్ కు పంపారన్నారు. గ్రామంలో నాటు సారా ఉన్నట్లు కేసు నమోదు చేస్తే వైసిపి నాయకుల పేర్లు బయటికి వస్తాయని కేసు నమోదు చేయకుండా రోడ్డుపై క్యాన్ తో వెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్సీబీ అధికారులు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. వాలంటీర్లు వైసీపీతో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా దేవర మనోహర కోరారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టే వాలంటీర్లను అన్ని పనులకు వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసిపి నాయకులే నాటు సారా తయారు చేయించి గ్రామంలో పంపిణీ చేయిస్తున్నారని విమర్శించారు. తీరా వాలంటీర్ల ను పట్టుకుంటే కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు. వైసిపి కుట్రలకు అరెస్ట్ అయిన మహిళా వాలంటీర్ ను విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వైసిపి నాయకులను విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో రామచంద్రాపురం జనసేన పార్టీ మండల అధ్యక్షులు సంజీవి హరి, వీరమహిళ లావణ్య పాల్ఘాట్, తిరుపతి అర్బన్ మండల అధ్యక్షుడు కిషోర్ రాయల్, తదితరులు పాల్గొన్నారు.