వేతనాలు… పెన్షన్లపై చీఫ్ సెక్రెటరీ లెక్కలు ఉద్యోగుల్నీ, ప్రజల్నీ తప్పుదోవ పట్టిస్తున్నాయి

•111% ఖర్చు చేస్తున్నట్లు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు?

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, ఫించన్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులతోపాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 111% మేర జీతాలు, పెన్షన్లకే వెళ్లిపోతుంది అంటే ఎవరైనా నమ్ముతారా? రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎందుకు ఈ విషయం ప్రస్తావించలేదు. ఇదే నిజమైతే ఆ విషయాన్ని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీలో లెక్కలు పక్కాగా చెప్పాల్సి ఉంటుంది. చీఫ్ సెక్రటరీతో ఈ తప్పుడు లెక్కలతో నివేదికను ఎవర్ని మోసపుచ్చడానికి తయారు చేయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు దూరం పెంచేందుకే ఇలాంటి నివేదికలు ప్రకటిస్తున్నారు.

• ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలెన్ని?

నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు అవుతున్న వ్యయం రూ.4,600 కోట్లు మేరకే ఉంటుందని ఉద్యోగ సంఘాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయి. ఆ విషయం నిజం కాకపోతే అప్పుడే చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎందుకు ఖండించలేదు. ఏటా రూ.67వేల కోట్లు ఖర్చవుతోందని ఎందుకు ప్రకటించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక నియమించిన వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జీతాలను కేంద్రం ఇచ్చే నిధుల నుంచే మళ్లిస్తున్నారు. ఇక ఏ దశలో రాష్ట్ర ఖజానాకు భారం పడుతుందో పారదర్శకంగా చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? జాబ్ మేళా స్థాయిలో వందలు, వేల ఉద్యోగాలేమైనా ఇచ్చారా? ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగం నుంచి సుమారుగా 15 వేల మంది రిటైరవుతున్నారు. ఆ మేరకు భర్తీ చేయలేదు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు. మరి ఏ విధంగా వ్యయం పెరిగిందో వెల్లడించాలి. ఉద్యోగులకు వేతనాలు పెంపులోనే ఇంతగా అంకెల గారడీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న యంత్రాంగం రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో ఇంకెన్ని తప్పుడు లెక్కలు వేస్తుందో అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రానికి వస్తున్న రాబడి కంటే ఎక్కువగా జీతాలకు ఇస్తున్నామని చెప్పడం ఆర్థిక శాఖ దివాళాకోరుతనాన్ని వెల్లడిస్తోంది. ఈ తప్పుడు లెక్కలను ప్రతి ఉద్యోగి ప్రశ్నించాలి… ప్రజలకు వివరించాలని శ్రీ నాదెండ్ల మనోహర్ కోరారు.