డ్రగ్స్‌ రహిత రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్నాం

ఒక బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా మేము డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆకాంక్షిస్తున్నాం. గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల ముప్పుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాం…’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే ముందు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసంలో మీడియాతో మంగళవారం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం ఓ రాజకీయపార్టీగా తమ బాధ్యతని, అందుకే దిల్లీ వచ్చామన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ దొరికినా చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోందని, దీనిపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. మాదకద్రవ్యాలకు అలవాటైన పిల్లలు, యువకులు ఆ వ్యసనం నుంచి బయటపడలేరని, వారి జీవితం అక్కడితో ముగిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు వ్యవస్థను విధ్వంసం చేసే ఆలోచన ఎవరూ చేయలేదు

తమ దగ్గర పార్టీ పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అడుగుతున్నారని, కరెంటు కోతలు, ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్‌కు సిగ్గుచేటని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయడం లేదని, వచ్చిన పన్నులను ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేయడం తప్ప ఏం చేయడం లేదన్నారు. సంపద సృష్టించలేని ప్రభుత్వాలు అవసరం లేదని ఓ ఆర్థిక నిపుణుడు వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. ‘సైబరాబాద్‌ నిర్మాణం తెలంగాణకు బంగారు గనిగా మారింది. దానికి మరింత అడ్వాన్సుడుగా అమరావతిలో నవ నగరాలకు ప్రణాళిక వేశాం. అవి పూర్తయితే రాష్ట్రానికి పెద్ద ఎత్తున రాబడి వచ్చేది. హైదరాబాద్‌కు మించిన రింగు రోడ్డు నిర్మాణాన్ని అమరావతిలో ప్రతిపాదించాం…’ అని ఆయన వివరించారు. ‘నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన శంషాబాద్‌ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, జీనోమ్‌వ్యాలీ వంటి అనేక పనులను ఆ తర్వాత ముఖ్యమంత్రులైన రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ కొనసాగించారు. రాజకీయంగా అప్పుడూ విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్నా వ్యవస్థను విధ్వంసం చేసే ఆలోచన ఎవరూ చేయలేదు. అందుకే కోకాపేటలో ఒకప్పుడు రూ.20 వేలు పలికిన ఎకరం ఇటీవల రూ.40 కోట్లు పలికింది…’ అని చంద్రబాబు పేర్కొన్నారు.