మీడియాపై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నాం

సీబీఐ విచారణకు వెళ్లాల్సిన కడప ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న మీడియా సిబ్బందిపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, హెచ్ఎం టీవీలకు సంబంధించిన విలేకరులను, ఇతర సిబ్బందిని గాయపరచి, వాహనాలను, కెమెరాలను ధ్వంసం చేయడం చూస్తుంటే వైసీపీ గూండాల బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. హైదరాబాద్ నగరంలో నడి రోడ్డుపై కడప ఎంపీ సంబంధీకుల వీరంగాన్ని తెలంగాణా ప్రజలు కళ్లారా చూశారు. మీడియాపై చేసిన దాడి వైసీపీలో నెలకొన్న ఆందోళననను, అసహనాన్ని సూచిస్తోంది. ఈ దాడికి పాల్పడినవారిపైనా, పురిగొల్పినవారిపైనా తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులను కోరుతున్నాను. ఏపీ ముఖ్యమంత్రి సైతం మీడియాకు రంగులు పూసి మాట్లాడుతున్నారు. బాబాయి హత్య కేసుకు సంబంధించి, వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఏబీఎన్, ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు వైసీపీకి కంటగింపుగా మారాయి. ఈ క్రమంలోనే భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఈనాడు, ఈటీవీ యాజమాన్యంపై మార్గదర్శి పేరుతో వేధింపులకు పాల్పడుతోంది వైసీపీ ప్రభుత్వం. దాడులు, వేధింపులతో మీడియాను కట్టడి చేయాలని చూడటం ప్రమాదకరం. ప్రజాస్వామ్యవాదులు ఈ చర్యలను ఖండించాలి అని నాదెండ్ల మనోహర్ కోరారు.