తెలంగాణకి ఎక్కువ టీకాలు ఇస్తాం.. ప్రభుత్వానికి భారత్ బయోటెక్ భరోసా..

తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రజలకు సరిపడా కొవిడ్ టీకాలు ఇస్తామని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లతో సమావేశం అయి కొవాగ్జిన్ టీకాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత్ బయోటెక్ ఎండీతో సమావేశమయ్యాను అని తెలిపారు. అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో వీలైనన్నీ ఎక్కువ డోసులు రాష్ట్రానికి ఇవ్వాలని కృష్ణ ఎల్లకు సీఎస్ విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇందుకు భారత్ బయోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి ఎక్కువ టీకాలు ఇస్తామని కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు అని తేల్చిచెప్పారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.