ఆరోగ్యవంతమైన పట్టణంగా తాడేపల్లిగూడెంను తీర్చిదిద్దుతాం

*ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఆరోగ్యవంతమైన, ఆధునిక సదుపాయాలతో కూడిన పట్టణంగా తీర్చిదిద్దే దిశగా నడుస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని 1వ వార్డు, 32వ వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గత వైసీపీ ప్రభుత్వ హయంలో అభివృద్ధికి అడ్డు తగలడం వల్ల పనులు కుంటుపడ్డాయని, ఇప్పుడు ఆ పనులను యుద్ధప్రాతిపదికన పునఃప్రారంభిస్తున్నామని తెలిపారు. 2014–2019 మధ్య మున్సిపల్ రిజర్వ్ స్థలంగా ఉన్న 1వ వార్డులో ఇండోర్ స్టేడియం, 32వ వార్డులో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి మున్సిపల్ తీర్మానం చేసినప్పటికీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అవి నెరవేరలేదని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు తన సొంత నిధులైన రూ.2 కోట్ల 35 లక్షలతో ఈ నిర్మాణాలను పూర్తి చేయడానికి తాను ముందుకొచ్చినట్లు తెలిపారు. ఈ పథకాల ద్వారా సామాన్య కుటుంబాల పిల్లలకు ఆధునిక క్రీడా వేదికలు అందుబాటులోకి రాబోతున్నాయని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన గత ప్రభుత్వంతో పోలిస్తే, తమ ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తోందని చెప్పారు. పనులను త్వరగా పూర్తిచేసేందుకు నిష్పక్షపాతంగా నిజాయితీగల కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. “మన ఊరు – మన తాడేపల్లిగూడెం” అనే నినాదంతో పార్టీ కలెరు కాకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి యజ్ఞానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మురుగునీరు తొలగించడం, చెట్లు పొదలను కత్తిరించడం, పల్లపు నేలలను మెరక్కచేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబి, పైబోయిన వెంకటరామయ్య, పాలూరి వెంకటేశ్వరరావు, కాళ్ల గోపికృష్ణ, దువ్వ శ్రీనివాస్, ముఖేష్, మద్దాల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment