పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం?

• వసతి దీవెన, విద్యా దీవెన బటన్లు నొక్కినా నిధులు ఇవ్వలేదు
• విద్యార్థుల సరిఫికెట్లు నిలిపివేస్తున్నా పట్టని వైసీపీ సర్కార్
• వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం

సంక్షేమ పథకాలు అందిస్తున్నాం… బటన్లు నొక్కి డబ్బులు వేస్తున్నాం అని ప్రజలను మోసం చేయడంలో వైసీపీ పాలకులు సిద్ధహస్తులు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. వీళ్ళ తప్పుడు ప్రకటనలు, విధానాల వల్ల ప్రజలు.. ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ఖజానాను దివాళా తీయించేసిన ఘనత ఘనులు శ్రీ జగన్ రెడ్డిదే. పథకాలకు సొమ్ములు లేవని తెలిసీ బటన్లు నొక్కడం జనాన్ని మభ్యపెట్టడమే. పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం ముఖ్యమంత్రి గారూ! పాలకుడి దివాళాకోరుతనం మూలంగా- విద్య, వసతి దీవెనలు వచ్చేశాయనుకొన్న విద్యార్థులు ఇప్పుడు అగచాట్లు పడుతున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో అసలు విషయం బయటపడింది. ట్రిపుల్ ఐటీలకు చెందిన 4 వేల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయాయి. బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ట్రిపుల్ ఐటీలతోపాటు ఇతర ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు సైతం ఇలాంటి ఇక్కట్లే పడుతున్నారు. ఉద్యోగాల్లో చేరాల్సిన వాళ్ళు, తదుపరి చదువులకు వెళ్లాల్సిన వాళ్ళు తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని బాధపడుతున్నారు. ఈ వాస్తవాలు తెలిసి కూడా వైసీపీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. జగన్ రెడ్డి తక్షణమే పని చేసే బటన్లు నొక్కి బకాయిలు చెల్లించి విద్యార్థులు రోడ్డున పడకుండా చూడాలి. జనసేన పార్టీ విద్యార్థుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.