*యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి
*యోగ దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
*జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట, యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని.. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. ఇందులో భాగంగానే ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నివిశాఖపట్నం కేంద్రంగా,రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారని, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా పలు ప్రపంచ రికార్డులు సాధించడం తోపాటు ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొనటం విశేషమన్నారు. యోగసాధనతో గిన్నిస్ రికార్డు.. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని బాలాజి చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. యోగా ప్రాముఖ్యత తెలిపేలా స్కూల్ సిలబస్లో ఒక పాఠం పెడతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు. ప్రజల్లో యోగాభ్యాసం పట్ల అవగాహనను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను కేవలం పది రోజుల్లో దాటడం యోగ పట్ల ప్రజల్లో పెరిగిన చైతన్యానికి, ప్రభుత్వ కృషికి నిదర్శనమన్నారు. 11వ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించనుండటం అదృష్టమని పేర్కొన్నారు. భారతీయ వ్యవస్థలో సంప్రదాయంగా వస్తున్న వ్యవస్థ యోగా అని రోజూ గంట ఆసనాలు వేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారని వివరించారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీరప్రాంతం వెంబడి ప్రధానితో పాటు 5 లక్షల మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించనున్నారని, యోగ ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు.
Share this content:
Post Comment