ప్రజాగ్రహంతో కాలగర్భంలో కలిసిపోనున్న వైసీపీ

  • జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

వైసీపీ మూడన్నరేళ్లుగా సాగిస్తున్న అరాచక, అవినీతి పాలనతో ప్రజలు విసిగివేసారిపోయి ఉన్నారని, ప్రజల గుండెల్లో నుంచి పెల్లుబికుతున్న ఆగ్రహంతో వైసీపీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోనుందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. మూడు రాజధానుల పేరిట రాష్ట్ర ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ భేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న వైసీపీ నేతల మాటల్ని ప్రజలు పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఉత్తరాంధ్రలో తలపెట్టిన గర్జన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పె మగాడు వైసీపీలో ఒక్కడు కూడా లేడా అని ప్రశ్నించారు. తమ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రులు తమ శాఖ ఏమిటో తెలియని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ని అకారణంగా తిట్టే శాఖను మాత్రం జగన్ రెడ్డి అందరికి అప్పచెప్పారని, ఈ శాఖను మాత్రం సక్రమంగా నిర్వహిస్తూ తమ రాజకీయ సమాధిని తామే కట్టుకుంటున్నారన్నారు. ప్రస్తుత మంత్రులుగా ఉన్న రోజా, రజని, అమర్నాధ్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులైన అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి ఎంతోమంది వైసీపీ నేతలు మొదట్లో సైకిల్ తొక్కిన వాళ్లేనని, వీళ్ళు అంతా చంద్రబాబు సంకలో పెరిగిన నిజమైన దత్తపుత్రులని ధ్వజమెత్తారు. పాడిందే పాట పాసిపళ్ల దాసా అన్నట్లు ఇంకెన్నాళ్లు ప్యాకేజీ అని మొరుగుతారని వైసీపీ నేతలపై గాదె ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ మాట్లాడుతూ జనసేన పేరు విన్నా పవన్ కళ్యాణ్ ని తలుచుకున్నా వైసీపీ నేతలకు ఫ్యాన్ట్లు తడిచిపోతున్నాయన్నారు. పరిపాలన గాలికి వదిలేసి ప్రజల మధ్య విద్వేషాల మంటలు రాజేసి అందులో రాజకీయ చలి కాచుకోవాలని చూస్తున్న వైసీపీ నేతల కుట్రలను జనసేన తిప్పికొడుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో తెలివిగలవారని , మంచివారని వైసీపీ నేతల ఉచ్చులో వాళ్ళు పడరన్నారు. మంత్రులు ఎంత రెచ్చకొట్టినా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంత్రులకు పిచ్చెక్కి ఏదిపడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ముస్లింలను నిలువెల్లా మోసం చేసిన జగన్ కి రానున్న ఎన్నికల్లో ముస్లింల దెబ్బ ఎలా ఉంటదో రుచి చూపిస్తామని నాయబ్ కమాల్ అన్నారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళహరి, ఉపాధక్ష్యులు అడపా మాణిక్యాలరావు, ఇస్లాం బేగ్, బిట్రగుంట మల్లిక, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, దాసరి వెంకటేశ్వరరావు, కొర్రపాటి నాగేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు.