రేవంత్ ను యువత బలంగా కోరుకుంది: కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ

పదవులు ఆశించి భంగపడిన అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన నేపథ్యంలో అసంతృప్తులతో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వెల్లడించారు. అసంతృప్తులతో మాట్లాడుతున్నామని, పరిస్థితులన్నీ త్వరలోనే చక్కబడతాయని ఆయన అన్నారు. టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పలు విషయాలపై ఇద్దరు నేతలూ చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని షబ్బీర్ అన్నారు. దాని కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ నాయకత్వాన్ని యువత బలంగా కోరుకుంటోందని చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో రేవంత్ మాట్లాడతారన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారని, కావాలనే జలవివాదాలను మళ్లీ రేపుతున్నారని ఆయన మండిపడ్డారు.