ఆడబిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తాం

* మీడియాపై కేసులు నమోదు అప్రజాస్వామికమన్న పవన్ కళ్యాణ్
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే… స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణకి- ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పక్కన ఉండేవాళ్ళు అర్థరాత్రి ఫోన్లు చేసి మానమర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడటం ఏం పధ్ధతి? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సదరు ఎమ్మెల్యేకి శ్రీమతి రాయపాటి అరుణ గారు తెలిపారని, ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాని బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ఈ ఘటన విషయంలో ధైర్యంగా ఉండాలని శ్రీమతి అరుణకి ఫోన్ ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆడబిడ్డను వేధించిన ఘటనను ప్రసారం చేసిన మహా టీవీ, 99 టీవీ ఛానెళ్లపై కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక్కటే తెలియచేస్తున్నామనీ, – మీ అనుచరులకు ఇది పధ్ధతి కాదని చెప్పమని చెప్పారు. రాజకీయాల్లో విధివిధానాలపై మాట్లాడుకుంటాం… అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదన్నారు. మహా టీవీ, 99 టీవీ ఛానెళ్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొని సమస్యకు ముగింపు పలకాలని సూచించారు.