నా పుట్టిన రోజు కానుక ఇదే.. ప్రధాని మోదీ ట్వీట్‌

సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ70వ పుట్టినరోజును దేశమంతా ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయనకు భారత్ తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ అర్థరాత్రి ట్వీట్ చేస్తూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారికి దూరంగా ఉండేందుకు ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. చాలా మంది తనకు పుట్టిన రోజు ఎలాంటి కానుక కావాలని అడిగారంటూ ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి ట్వీట్‌ చేశారు. ‘చాలామంది నా పుట్టిన రోజున నేను ఏమి కోరుకుంటాను అడిగారు. ఇప్పుడు నేను కోరుకునేది ఒక్కటే.. ప్రతీ ఒక్కరు మాస్క్‌లు సరిగ్గా ధరిస్తూ .. సామాజిక దూరాన్ని అనుసరించండి. గుర్తు పెట్టుకోండి. దో గజ్‌కీ దూరీ.. రద్దీ ప్రదేశాలకూ వెళ్లకండి. మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. మన గ్రహాన్ని ఆరోగ్యంగా తయారు చేసుకుందాం’ అంటూ పిలుపునిచ్చారు.

భారతదేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు తమ హృదయపూర్వకమైన ఆ కాంక్షలను పంచుకున్నారు. నన్ను పలకరించిన ప్రతి వ్యక్తికి నేను కృతజ్ఞుడిని. ఈ అభినందనలు నా తోటి పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సేవ చేసేందుకు నాకు శక్తినిస్తాయి’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.