గుజరాత్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి

గుజరాత్‌లోని భరూచ్ నగరంలో దారుణం జరిగింది. భారుచ్‌లోని పటేల్‌ వెల్ఫేర్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. కొవిడ్‌ వార్డులో చికిత్స తీసుకుంటున్న 12 మంది రోగులు మంటలు అంటుకొని 12 మంది రోగులు సజీవ దహనమయ్యారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 50 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వారిలో 24 మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భరూచ్ ఎస్పీ తెలిపారు.

భరూచ్-జంబూసర్ జాతీయ రహదారిపై ఉన్న ఈ వెల్పేర్ ఆసుపత్రిని ఓ ట్రస్టు నిర్వహిస్తోంది. నాలుగు అంతస్తులున్న ఈ ఆసుపత్రిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.