4వ టెస్ట్: రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

భారత్-ఆస్ట్రేలియాల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్లు తొలి ఓవర్‌లోనే ఆసీస్‌కు షాక్‌ ఇచ్చారు. మొదటి ఓవర్ వేసిన మహ్మద్‌ సిరాజ్‌.. సరైన ఫామ్‌ లేక ఇబ్బందిపడుతున్న డేవిడ్‌ వార్నర్‌(1)ని పెవిలియన్‌కు పంపాడు. ఓపెనర్‌గా దిగిన వార్నర్.. తొలి ఓవర్‌ నాలుగో బంతికి స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఈ బంతిని స్లిప్‌లో ఉన్న రోహిత్‌ డైవ్‌ చేసి మరీ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. అనంతరం బౌలింగ్‌కు దిగిన శార్దుల్‌ ఠాకూర్‌ తాను వేసిన తొలి బంతికే హారిస్‌ను ఔట్‌ చేశాడు. స్క్వేర్ లెగ్ ఫీల్డింగ్‌ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ చక్కని క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం లబుషైన్‌ (16), స్టీవ్‌ స్మిత్‌ (17) క్రీజులో ఉన్నారు. దాంతో ఆస్ట్రేలియా ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌, ఆసీస్‌ 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌ను టీమిండియా ఓడిపోగా.. రెండో మ్యాచ్‌ను భారత్‌ గెలిచింది. మూడో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. దాంతో సిరీస్ గెలవాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సిందే.