బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్

బోయినపల్లి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు మరో పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయప్ప సొసైటీ దగ్గర ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రవీణ్‌రావు కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కిడ్నాప్ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి, ఏ2గా మాజీ మంత్రి అఖిలప్రియ, ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ ఉన్నారు. వీరిపై 448,419,341,342,506,366,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే అఖిలప్రియ, ఆమె సోదరుడు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీప బంధువులైన ప్రవీణ్ రావు, సునిల్ రావు, నవీన్ రావులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఈ ఉదయం ఫిర్యాదు అందింది. వికారాబాద్ జిల్లాలో కిడ్నాపర్ల వదిలివేయడంతో ముగ్గురు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో సినీఫక్కీలో వారు కిడ్నాప్‌కు గురయ్యారు. ఐటీ అధికారులమంటూ కిడ్నాపర్లు ఇంట్లోకి చొరబడ్డారు. మహిళలతో సహా చిన్న పిల్లలను ఓ గదిలో బంధించి వీరిని అపహారించుకుని వెళ్లారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగంతో పోలీసులు కేసు నమోదు చేశారు.