భారత్ నుంచి త్వరలో మరిన్ని వ్యాక్సిన్​లు: మోదీ

ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపట్టి.. కేవలం 12 రోజుల్లోనే 23 లక్షల మందికి వ్యాక్సిన్​ వేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కొన్ని నెలల్లోనే 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్​) సదస్సులో వర్చువల్​గా పాల్గొన్న మోదీ ఈ వివరాలు తెలిపారు.

భారత్​ ప్రస్తుతం రెండు టీకాలు తయారు చేసిందని.. త్వరలో మరిన్ని వ్యాక్సిన్​లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కరోనా కారణంగా భారత్ ప్రపంచస్థాయి బాధ్యతను తీసుకుని.. 150 దేశాలకు అవసరమైన ఔషధాలు సరఫరా చేసిందని గుర్తు చేశారు.

‘కరోనా వల్ల భారత్​ అత్యధికంగా ప్రభావితమవుతుందని ప్రపంచమంతా భావించింది. 70-80 కోట్ల మందికి కరోనా సోకుతుందని, కనీసం 20 లక్షల మంది చనిపోతారని అంచనాలు వచ్చాయి. కానీ భారత్ నిరాశ చెందకుండా.. ఆ పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పుడు భారత్ అత్యంత సమర్ధంగా కరోనాను ఎదుర్కొంటోంది.’ అని మోదీ వివరించారు.