అమిత్ షాతో రఘురామ కృష్ణరాజు భేటీ..

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై త్వరితగతిన దర్యాప్తు చేయాలని హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాకు వై కేటగిరీ భద్రత ఇచ్చినందుకు హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపాను. విభజన హామీలు, పోలవరం సహా అనేక అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లా. విభజన చట్టం ప్రకారం రావలసిన అంశాలు, రాష్ట్ర సమస్యలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లా. కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరతాయని ఆశాభావం ఉంది. రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులు, అమరావతి సెంటిమెంట్‌ను హోంమంత్రికి వివరించా. ఏపీ పర్యటనకు రావాలని అమిత్ షాను కోరా, త్వరలో వస్తా అన్నారు. నా ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు’ అని స్పష్టం చేశారు.