కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలి

  • త్వరలో గ్రామస్థాయిలో పోరాటాలు
  • ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన జనసేన ఇంచార్జ్ యుగంధర్.

గంగాధర నెల్లూరు, జనసేన పార్టీ గంగాధర నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న నగరి డివిజన్ ఆర్డీవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ వినతి పత్రంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పెనుమూరు, వెదురుకుప్పం, కార్వేటి నగరం, ఎస్ఆర్ పురం, గంగాధర నెల్లూరు మరియు పాలసముద్రం మండలాలు ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా పునర్విభజనలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలిపారని, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపారని తెలియజేశారు. నగిరి నియోజకవర్గంలో ఉన్న పుత్తూరు, వడమల పేట మండలాలను తిరుపతి జిల్లాలో కలిపారని, ఇటీవల పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న రొంపిచర్ల పులిచెర్ల మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుటకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, రాజపత్రమే తరువాయని తెలిపారు. అయితే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో చారిత్రిక నేపథ్యం కలిగిన చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్ పురం మరియు పెనుమూరు మండలాలు ఉండడం అన్ని విధాలుగా శ్రేయస్కరం, ఆమోదయోగ్యం, అది మంచిదని ఉద్ఘటించారు. కార్వేటి నగరం మండలం తుడా పరిధిలో ఉందని, కార్వేటి నగరం మండలం స్వభావికంగా నిరుపేదని, అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలు ప్రతినిత్యం ప్రయాణాలు తిరుపతికే 98% ఉంటాయి కానీ, చిత్తూరుకి ఉండవని, వ్యాపార నిమిత్తం ఇక్కడి ప్రజలు తిరుపతితో సత్సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు. విద్యార్థులు, చదువుకున్న నిరుద్యోగులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు, ముఖ్యంగా వ్యాపారస్తులు తిరుపతి కెళ్ళి వస్తుంటారని ఏ రకంగా చూసినా కార్వేటి నగర్ మండలం తిరుపతి జిల్లాలో ఉండటం ఉత్తమమని, 2023 ప్రకారం కార్వేటినగరం మండల జనాభా 63,048 మంది ఉన్నారని తెలియజేసారు. తిరుపతికి అతి సమీపంలో ఉన్న, మరీ ముఖ్యంగా తుడా పరిధిలో ఉన్న కార్వేటి నగరం మండలాన్ని ఉన్నత చారిత్రాత్మక నేపథ్యం కలిగిన తిరుపతి జిల్లాలో కలిపే అత్యుత్తమ ప్రతిపాదనలు పంపి, రాష్ట్ర ప్రభుత్వానికి కార్వేటి నగరం మండల ప్రజల ఆర్తనాథాలు విని, ప్రజాభిప్రాయ సేకరణ చేసి, కార్వేటి నగరం మండల పురోభివృద్ధికి తోడ్పాటునందించి తిరుపతి జిల్లాలో కలపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి నరేష్ ఉన్నారు.