పెద్దఅంబర్‌పేట్‌లో ఘోర ప్రమాదం..

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఆగిఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్నోవా కారు (ఏపీ07ఈసీ5599) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పామిడిపాడు నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్తున్నది. ఈక్రమంలో ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలో పెద్దఅంబర్‌పేట్‌ వద్ద కాలకృత్యాల కోసం డ్రైవర్‌ కసిందుల హన్మంతు కారును రోడ్డుకు పక్కన ఆపాడు. అదేసమయంలో ఇనుపలోడుతో వచ్చిన ఓ డీసీఎం (ఏపీ29యూ2852) కారు వెనుక ఆగింది.

అయితే అదే రోడ్డులో మిర్చీలోడ్‌తో మార్టూరు నుంచి పటాన్‌చెరు వెళ్తున్న మరో డీసీఎం (ఏపీ39టీఎన్‌8699) ఆగిఉన్న డీసీఎంను వేగంగా ఢీకొట్టింది. దీంతో అది ముందున్న ఇన్నోవాను బలంగా తాకింది. దీంతో కారు డ్రైవర్‌ హన్మంతు అక్కడిక్కడే మృతిచెందాడు. మిర్చీ లోడుతోఉన్న వాహనంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రైతు మృతిచెందాడు. కాగా, ఇనుప లోడుతో ఉన్న డీసీఎం డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

మృతులు వాహనాల్లో ఇరుక్కుపోవడంతో క్రేన్‌ సహాయంతో వారిని బయటకి తీశారు. గాయపడిన డ్రైవరును దవాఖానకు తరలించగా, మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.